
రిమ్స్ మౌలిక సదుపాయాలకు విరాళం
కడప సెవెన్రోడ్స్ : యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ (యూసీఐఎల్) జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి మౌలిక సదుపాయాలు కల్పన, పరికరాల కొనుగోలు కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)నిధుల కింద రూ. 53.67 లక్షల విరాళ చెక్కును కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి అందజేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ (టెక్నికల్) మనోజ్ కుమార్, జనరల్ మేనేజర్ (మిల్ ) సుమన్ సర్కార్, సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ను కలసి చెక్ ను ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందజేసిన నిధులతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్లో ఆప్తమాలజీ, ఆప్తోపెడిక్స్, ఓబీజీ గైనిక్ ఈన్టి, రేడియాలజీ అనిష్టిసియా డిపార్టుమెంట్స్లలో పరికరాల కొనుగోలుకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఆకాంక్షిత జిల్లా అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పనలకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూసీఐఎల్ సీఎస్ఆర్ ఆఫీసర్ నవీన్ రెడ్డి, జియాలజిస్ట్ సురేంద్ర విజయ్ కుమార్, మేనేజర్ పీకే నాయక్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.