
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని సర్వజన ఆసుపత్రికి తీవ్ర ఆనారోగ్యంతో బత్తల చిన్నా (35) అనే పేరుతో ఈనెల 28న ఓ వ్యక్తిని వైద్యం కోసం చేర్పించారు. అతడు శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అతని ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలనీ రిమ్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
యువతిపై దాడి కేసులో విచారణ
ముద్దనూరు : మండలంలోని నల్లబల్లె గ్రామంలో గురువారం సాయంత్రం హరిణి అనే యువతిపై కత్తితో దాడి చేసిన కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం సీఐ దస్తగిరి తమ సిబ్బందితో కలిసి సంఘటన జరిగిన నల్లబల్లె గ్రామంలోని యువతి ఇంటికి వెళ్ళి దర్యాప్తు చేపట్టారు. సెల్ఫోన్ నంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టినందుకు క్రాంతి కుమార్ అనే యువకుడు హరిణి ముఖంపై కత్తితో దాడిచేసి గాయపరచాడు.దీనిపై కేసు నమోదు చేసి బాధితురాలిని సీఐ విచారించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సెల్ టవర్పై నుంచి
కిందపడి యువకుడి మృతి
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని దొండపాడు రస్తాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ముద్ద శివసాయి(27) అనే యువకుడు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం శివసాయి సెల్ టవర్ ఎక్కి పనులు చేస్తుండటగా ప్రమాదవశాత్తు తాడు విరిగిపోవడంతో కింద పడి మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడు శివసాయి వేంపల్లి మండలం అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఎర్రగుంట్ల పోలీసులు మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
రోడ్డు ప్రమాదంలో
గాయపడిన ఆటో డ్రైవర్ మృతి
కడప అర్బన్ : కడప – ఒంటిమిట్ట రహదారిలో ఈనెల 28వ తేదీన రాత్రి ఆటో నడుపుకుంటూ ఇంటికి వెళుతున్న ఆటో డ్రైవర్ పెయ్యాల శ్రీనివాసులు (40) అనే వ్యక్తిని కడప కేంద్ర కారాగారం సమీపంలోని సైనిక్నగర్ వద్ద గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈసంఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి ఈనెల 29న పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్పై నుంచి పడి
మహిళకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : బైక్పై నుంచి పడి మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం కురబలకోట మండలంలో జరిగింది. పీటీయంకు చెందిన ఇమ్రాన్బాషా భార్య హసీనా(48) కుమారుడు ముజాహిద్ధీన్తో కలిసి మదనపల్లెకు ద్విచక్రవాహనంలో వస్తుండగా, మార్గమధ్యంలోని కురబలకోట మండలం దొమ్మన్నబావి వద్ద ఆమె కట్టుకున్న చీర బైక్ వెనుకచక్రంలో చిక్కుకుపోవడంతో అదుపుతప్పి వాహనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది.

రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం