
● వలంటీర్ల సేవలు అమూల్యం
● హామీ ఇచ్చి.. విస్మరించి..
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే వలంటీర్లలో విద్యార్హతలను బట్టి తగిన నైపుణ్య శిక్షణ ఇప్పించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హత పొందేలా చర్యలు తీసుకుంటామంటూ ఊరూరా తిరిగి హామీలు ఇచ్చారు. అయితే ‘ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న..’ అన్న చందంగా అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థకే మంగళం పాడారు. పైగా ప్రజల్లో జగన్ చేసిన మంచి పనులను లేకుండా చేయడం ద్వారా ఆయన ముద్ర చెరిపి వేసేందుకు సచివాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించే చర్యలకు సిద్ధం కావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కడప సెవెన్రోడ్స్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టింది. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఏర్పాటు చేసింది. పాలనను ప్రజల ఇంటి ముగింటకు చేర్చింది. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు ఉంటే.. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముద్ర చిరస్థాయిగా ఉంటుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఎలాగైనా ఆ ముద్ర చెరిపేయాలని కుట్ర పన్నుతోంది. ఇందుకోసం ఏకంగా ఆ వ్యవస్థల ఎత్తివేత దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడింది. సచివాలయ వ్యవస్థను క్రమేణా కనుమరుగు చేయాలని చూస్తోంది. దీంతో చెంతకు చేరువైన పాలన మళ్లెక్కడ దూరమవుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
విప్లవాత్మక మార్పు
ఎన్టీ రామారావు మండల వ్యవస్థను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేశారు. అప్పట్లో అది ఓ విప్లవాత్మకమైన మార్పు. దాని కొనసాగింపుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి.. ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ పాలన తీసుకు రావడం ద్వారా ఇతర రాష్ట్రాలకు రోల్మోడల్గా నిలిచారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటి తలుపు తట్టాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవస్థ ప్రజలకు తప్పింది. ఏ చిన్న పనైనా వలంటీర్కు చెబితే ఇట్టే పరిష్కారమయ్యేది. మైఖేల్ క్రిమేర్, ఫ్రెంచ్–అమెరికన్ ఎకానమిస్ట్ ఈస్తర్ డఫ్లో వంటి నోబెల్ బహుమతి గ్రహీతలు సైతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాల తీరును పరిశీలించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం, మహిళా సాధికారత తదితర అంశాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా సచివాలయాలను కనుమరుగు చేసే చర్యలకు పాల్పడుతోంది.
బాపూజీ కల సాకారం దిశగా...
మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాాజ్య సాకారం కోసం 2020 అక్టోబరు 2వ తేదీన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుత వైఎస్సార్ కడప జిల్లాలో 423 గ్రామ సచివాయాలు, 226 వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. వివిధ శాఖలకు చెందిన 536 రకాల ప్రభుత్వ సేవలు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో అత్యధిక సేవలు కేవలం 15 నిమిషాల నుంచి 72 గంటల్లోనే ప్రజలకు అందేవి. ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్ను నియమించారు. వీరికి ప్రతి నెల రూ.5 వేల గౌరవ వేతనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పెన్షన్లు, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, లా నేస్తం, చేదోడు, చేయూత, ఈబీసీ నేస్తం, ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కు సంబంధించిన సాయం, వివాహ రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఆధార్ అప్డేషన్, ఇసుక బుకింగ్ వంటి అనేక సేవలు ప్రజలకు అందజేయడంలో వలంటీర్లు ఎంతో కీలకంగా పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని తీసు కొచ్చినా.. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం మొదలు, వారితో దరఖాస్తు చేయించి లబ్ధి పొందేందుకు వలంటీర్లు ఎంతో సహకరించారు.
వైఎస్సార్సీపీ హయాంలో గ్రామ స్వరాజ్యం
సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఏర్పాటు
ఇంటి ముంగిటకే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు
జగన్ ముద్ర చెరిపేసేందుకు కూటమి కుట్ర
ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థకు మంగళం
సచివాలయాల ఎత్తివేతకు పన్నాగం
పేదల సంక్షేమంపై నీలినీడలు
సచివాలయ, వలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దనే అందడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి తప్పిపోయింది. ఇందువల్ల తమ పనులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అలాగే అధికారులకు లంచాలు ఇచ్చే అవసరం తప్పింది. ప్రభుత్వం చేపట్టే ప్రతి ఇంటింటి సర్వే నిర్వహించడంలో వలంటీర్ల కృషి మరువలేనిది. ముఖ్యంగా కరోనా విజృంభించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సందర్భంలో కూడా.. వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వేతోపాటు పెన్షన్లు, ప్రభుత్వ ఆర్థికసాయం, మాస్క్లు, శానిటైజర్లు, మందులు వంటివి అందజేశారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు కరోనా అంటే వణికిపోయినా.. ఆ రోజుల్లో ఇంటింటికీ తిరిగి అమూల్యమైన సేవలు అందించారు. వలంటీర్ల సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వం వారిని సత్కరించి గౌరవించింది.

● వలంటీర్ల సేవలు అమూల్యం

● వలంటీర్ల సేవలు అమూల్యం

● వలంటీర్ల సేవలు అమూల్యం