
ఎంఎస్ఎంఈల సాధికారతతో రాష్ట్రాభివృద్ధి
కడప సెవెన్రోడ్స్: సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల సాధికారతతోనే రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిపుష్ఠి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అఽధికారులు, ఎంఎస్ఎంఈల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా రాణించాలన్నారు. పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లా నుంచి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు, బైరెటీస్, బేరియం క్లోరైడ్ వంటి ఉత్పత్తులు అధికంగా ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ ఇండస్ట్రీలో మ్యాన్ పవర్ అవసరం చాలా ఎక్కువగా ఉందన్నారు. స్థానిక యువత అందుబాటులో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి మాట్లాడారు. టిక్కి ఆర్గనైజేషన్ ప్రతినిధి రామ్మూర్తి నాయక్, డిక్కి కో–ఆర్డినేటర్ శివశంకర్, ఫ్యాప్సియా ప్రతినిధి గల్లా శ్రీధర్, జ్ఞాన ప్రకాశ్లతోపాటు ఏపీఐఐసీ, పరిశ్రమలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్పై
అపోహలు వద్దు
కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కులోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్పై జిల్లాలో అపోహాలు వద్దని ఎంఎస్ఎంఈ, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. టెక్నాలజీ సెంటర్ను ఇక్కడే ప్రతిపాదించామని చెప్పారు. పీపీపీ మోడల్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామిని గుర్తించే పనిలో ఉందని తెలిపారు. మే 1వ తేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో 10 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తారని చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో ఒక ఎంఎస్ఎంఈ పార్కుకు ప్రారంభోత్సవం చేస్తామని, మరో రెండు పార్కులకు భూమిపూజ నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు జిల్లాలో ఉన్న అవకాశాలు, వాటిని ఎలా ప్రమోట్ చేయాలో కార్యచరణ రూపొందించేందుకు జిల్లా పర్యటనకు వచ్చామన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్, డిక్కీ, సిక్కి, టిక్కి, కొప్పర్తి ఐలా ప్రతినిధులతో సమావేశమై ఫిర్యాదులు స్వీకరించామన్నారు.
ఏపీఐఐసీ నుంచి సేల్ రిజిస్ట్రేషన్లు చేయించండి
కడప కార్పొరేషన్: సేల్ రిజిస్ట్రేషన్ల సమయంలో ఏపీఐఐసీ నుంచి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మైదుకూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిశ్రమల యజమానులు కోరారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ను వారు కొప్పర్తి పారిశ్రామికవాడలో కలిసి వినతి పత్రం అందజేశారు.సూక్ష్మ పరిశ్రమలకు పీఎఫ్, ఈఎస్ఐలతో నిమిత్తం లేకుండా ఏపీఐఐసీ సేల్ రిజిస్ట్రేషన్లు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొప్పర్తి, మైదుకూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధులు పల్లేటి రమణారెడ్డి, మదన్కుమార్, కిశోర్బాబు, కేవీ సురేష్ పాల్గొన్నారు.
కలెక్టర్ గారూ.. ఇదేమిటి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారిక హోదాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి సైతం పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఆయనకు ఎలాంటి ప్రభుత్వ హోదా లేకపోయినా వేదికపై కూర్చోవడం, అందుకు కలెక్టర్ శ్రీధర్ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో కూడా డీఆర్సీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు విమర్శలు వచ్చాయి.
మంత్రి శ్రీనివాస్