కొనుగోళ్ల వెంటే చెల్లింపులు

శనగలు విక్రయిస్తున్న రైతులు   
 - Sakshi

కడప అగ్రికల్చర్‌ : రాష్ట్ర ప్రభుత్వం రైతులను అడుగడుగునా ఆదుకుంటోంది. పంటల సాగుకు పెట్టుబడి సాయం నుంచి.. దిగుబడులు వచ్చిన తరువాత గిట్టుబాటు ధర కల్పిస్తూ అండగా నిలుస్తోంది. ఇందుకోసం శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో నెల రోజుల ముందు నుంచే శనగల కొనుగోలు ప్రారంభించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

క్వింటాల్‌కు రూ.735 ఽఅదనంగా ధర

జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్‌లో 29 మండలాల పరిధిలో 63,122 హెక్టార్లలో శనగ పంట సాగు చేశారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌ రూ.4,600 ఉండగా.. ప్రభుత్వం 5,335 చెల్లిస్తోంది. అంటే క్వింటాల్‌పైన రూ.735 అదనపు ధర కల్పిస్తోంది. ఎకరాకు సాధారణ దిగుబడి 5 క్వింటాళ్ల చొప్పున లెక్కకట్టి కొనుగోలు ప్రారంభించింది. ఈ లెక్కన 5 క్వింటాళ్ల నుంచి ఆపైన ఎంత ఉన్నా కొనుగోలు చేస్తున్నారు. రాజుపాళెం మండలంలో ఒకే రైతుకు సంబంధించి 235 క్వింటాళ్లు కొ నుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులు తెలిపారు.

11,118 మెట్రిక్‌ టన్నుల కొనుగోలు

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 29 మండలాల పరిధిలో 63,122 హెక్టార్లలో శనగ పంట సాగు చేశారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 20,850 మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు అనుమతులు ఇచ్చింది. గత నెల 13 నుంచి 22 కొనుగోలు కేంద్రాల పరిధిలో ఈ నెల 16వ తేదీ నాటికి 11,118.5 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు.

రూ.18.86 కోట్ల చెల్లింపు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా ధాన్యం కొనుగోలు చేసి గోడౌన్‌కు ఽచేరిన 21 రోజుల తరువాత చెల్లింపులు ఉంటాయి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి శనగలు కొనుగోలు చేసి గోడౌన్‌కు తరలించిన వారం, పది రోజుల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,528 రైతుల నుంచి రూ.59.31 కోట్ల విలువ చేసే 11,118.5 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేసింది. 2078 మంది రైతులకు రూ.18.86 కోట్లను చెల్లించినట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులు తెలిపారు. ఇంకా 3450 మంది రైతులకు 40.45 కోట్ల చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.

కేంద్రాల ద్వారా వేగంగా శనగల సేకరణ

వారం, పది రోజులకే

డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

గడువులోపు లక్ష్యం సాధిస్తాం

జిల్లాలో ప్రస్తుతం శనగల కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 20832 మెట్రిక్‌ టన్నులకు గాను ఇప్పటి వరకు 5528 మంది రైతుల నుంచి 11 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా కొనుగోలు చేశాము. ఇ ప్పటి వరకు 2078 మంది రైతులకు నగదు చెల్లించాము. మిగతా 3450 మంది రైతులకు త్వరలో చెల్లిస్తాము. లక్ష్యాన్ని గడువులోపు సాధిస్తాం.

– తాటిగొట్ల నరసింహారెడ్డి,

డీఎం, జిల్లా మార్క్‌ఫెడ్‌

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top