భువనగిరిటౌన్ : భువనగిరి బైపాస్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో షియా ముస్లిం సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రజా హుస్సేన్ (75) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సయ్యద్ రజా హుస్సేన్ శనివారం భువనగిరి నుంచి రామకృష్ణాపురం రోడ్డులో ఉన్న తన వ్యవసాయ బావి వద్దకు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైపాస్ రోడ్డుపై రామకృష్ణాపురం రోడ్డు వైపు మళ్లుతుండగా, హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఆయన బైక్ను బలంగా ఢీకొట్టి డివైడర్పైకి దూసుకెళ్లింది. దీంతో బైక్పై ఉన్న రజా హుస్సేన్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వారు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.
అడవిపంది దాడిలో
వ్యక్తికి గాయాలు
ఆలేరురూరల్: ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన ఎలుగందుల చక్రపాణి అనే వ్యక్తి శనివారం ఇంటి సమీపంలో పనులు చేస్తుండగా అడవిపంది ఒక్కసారిగా దాడి చేసింది. ఈప్రమాదంలో ఆయన ఎడమ చేయి, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
చౌటుప్పల్ : అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్పేట గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లోని బహదూర్పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అలీ(26) శనివారం కోదాడలోని పశువుల సంతలో కొనుగోలు చేసిన ఎద్దులు, ఆవులను తన వాహనంలో ఎక్కించుకున్నాడు. వాటిని హైదరాబాద్కు తరలిస్తుండగా.. చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్పేట గ్రామం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో నాలుగు ఆవులు, ఆరు ఎద్దులు ఉన్నాయి. వాహనాన్ని స్వాధీనం చేసుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పశువులను గోశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.


