యాదగిరిగుట్ట : జూన్ 5,6,7 తేదీల్లో హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించనున్న పోచంపల్లి ప్రదర్శనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆహ్వానించారు. శనివారం యాదగిరీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన సీఎంకు ఆలయ ముఖ మండపంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డితో కలిసి కలెక్టర్ ఆహ్వాన పత్రికను ఇచ్చారు.
147 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ
భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు నిర్వహించారు. మొత్తం 375 మంది కార్యదర్శులలో 147 మందికి స్థానచలనం కలిగిస్తూ ఉన్నతాధికారులు శనివారం తుది నిర్ణయం తీసుకున్నారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆధ్వర్యంలో ఈ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా సాగింది. ఒకే స్థానంలో నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న 144 మంది కార్యదర్శులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీ చేయగా, మూడేళ్ల సేవా కాలం పూర్తి చేసుకొని వ్యక్తిగత కారణాల వల్ల బదిలీ కోరుతూ దరఖాస్తు చేసుకున్న ముగ్గురు కార్యదర్శుల అభ్యర్థనలను అధికారులు పరిశీలించి ఆమోదించారు. ఈ ప్రక్రియలో జిల్లా పంచాయతీ అధికారి కె. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొని బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. బదిలీల ఉత్తర్వులను ఈ నెల 25వ తేదీ వరకు సెక్రటరీలకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర్వులు అందుకున్న పంచాయతీ కార్యదర్శులు తక్షణమే స్పందించి, ఈ నెలాఖరు నాటికి తమకు కేటాయించిన కొత్త గ్రామాలలో కచ్చితంగా బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు.
భారీ బందోబస్తు
యాదగిరిగుట్ట రూరల్: సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం హెలీపాడ్ ప్రాంతంతో పాటు, కొండ కింద పాదాలు, ఘాట్ రోడ్లు, టెంపుల్ సిటీ, స్వామి వారి ఆలయం వద్ద ఇలా అడుగడుగునా భద్రతా బలగాలు మోహరించాయి. దీనిలో భాగంగా ఐజీ, డీఐజీ, ఎస్పీలతో పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు ఆరుగురు, ఇన్స్పెక్టర్లు 21మంది, ఎస్ఐలు 38మంది, కానిస్టేబుళ్లు 300 మంది బందోబస్తులో పాల్గొన్నారు.
లక్ష్యసాధనకు నైపుణ్యాలు అవసరం
భువనగిరిటౌన్ : యువత లక్ష్యసాధనకు నైపుణ్యాలు అవసరమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్ రావు పేర్కొన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో జిల్లా యువజన, క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాల ఆరో రోజు ఉద్యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మే 2న నల్లగొండలో నిర్వహించిన జాబ్మేళాలో ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అనంతరం 2వ ఎడిషన్ సీఎం కప్–2025 విజేతల తో పాటు టూరిజం, పోలీస్ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఐసీ జీఎం రవీందర్, ఐటీఐ ప్రిన్సిపాల్ హరికృష్ణ, ఏటీసీ ఆఫీసర్ రఘునాథ్, మై భారత్ ప్రెసిడెంట్ అంబేద్కర్, కరుణ్, క్రీడాకారులు, ఏటీసీ విద్యార్థులు సుమారు 500 మంది పాల్గొన్నారు.


