ఫ భువనగిరి డీఎస్పీ రవీందర్రెడ్డి
భువనగిరి : గ్రామాల్లో ఉపయోగంలో లేని బోరు గుంతలను రైతులు వెంటనే మూసి వేయాలని భువనగిరి డీఎస్పీ రవీందర్రెడ్డి సూచించారు. బోరు గుంతలతో జరుగుతున్న ప్రమాదాలపై ఆయన ఆదివారం స్పందించారు. పొలాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న బోరు గుంతల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లలను ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల వద్ద ఒంటరిగా ఆడనివ్వరాదన్నారు. గ్రామాలలో, కాలనీల్లో బోర్ గుంతలను గుర్తించాలన్నారు. కొత్తగా తవ్విన బోర్ గుంతలను పని పూర్తయ్యాక భద్రంగా కప్పివేయాలని, ఎక్కడైనా నిర్లక్ష్యంగా వదిలిన బోర్ హోల్స్పై స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ, పట్టణ స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించి ఉపయోగంలో లేని బోర్ హోల్స్ను మూసివేయించాలని సూచించారు.
విద్యాలయాలే
దీప స్తంభాలు
నల్లగొండ టూటౌన్ : విద్యాలయాలే దేశాభివృద్ధికి దీప స్తంభాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజీ యూనివర్సిటీలో విశ్వవిద్యాలయం స్వల్ప, దీర్ఘకాల ఇనిస్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా కొత్త కళాశాలలు, హాస్టళ్లు, అకాడమిక్ బ్లాకులు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు, లైబ్రరీ, ఇంజినీరింగ్ విభాగ విస్తరణ వంటి పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులను దశలవారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యార్థి ప్రాజెక్టులు, డాక్టరల్ రీసెర్చ్ మెరుగుదలకు అధ్యాపకులు కీలకపాత్ర పోషించాలన్నారు. నాన్–టీచింగ్ సిబ్బంది పారదర్శక పరిపాలన, రికార్డు నిర్వహణ, విద్యార్థి సేవల బలోపేతంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ హరీష్కుమార్, శ్రీనివాసరెడ్డి, ఎస్ఓ బేగ్, శ్రీహరి పాల్గొన్నారు.


