యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నిత్య పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామునే స్వామి వారిని మేల్కొలిపి, సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వయంభువులకు నిజాభిషేకం, బిందె తీర్ధం, ఆరాధన, అర్చనలు చేశారు. ప్రధానాలయం ముఖమండపలంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన సేవలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవ సేవలను నిర్వహించారు. సాయంత్రం జోడు సేవలను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
అవగాహన తోనే
హెచ్ఐవీ నిర్మూలన
భువనగిరి : సరైన అవగాహన తోనే హెచ్ఐవీని పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చని ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అంతర్జాతీయ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏయిడ్స్తో మృతి చెందిన వారికి కొవ్వత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ కిరణ్కుమార్, సూపర్వైజర్ సంతానియా, స్కీడ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ భానుకుమార్, ఐసీటీసీ కౌన్సిలర్లు ముత్యాలు, సైదులు, సతీష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.


