నాగార్జునసాగర్ : సాగర్ను దేశంలోనే మొదటి డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రంగా, బుద్ధవనాన్ని మరో తిరుపతిలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి తెలిపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజులుగా నాగార్జునసాగర్లో పర్యటిస్తున్న ఆయన మంగళవారం లాంచీలో నాగార్జునకొండకు చేరుకుని పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం నాగార్జునకొండపై పునర్నిర్మితమైన అశ్వమేధ యజ్ఞశాల, మహాస్థూపం, సింహళ విహారాలను పరిశీలించి వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వదేశీ దర్శన్ పథకం కింద బుద్ధవనం పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.500కోట్లతో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. నాగార్జునకొండ పక్కనే గల చాకలి గట్టును అభివృద్ధి చేయడంతో పాటు హౌస్ బోట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. 20 నుంచి 30మంది పర్యాటకులు ప్రయాణించేలా ఆధునిక సౌకర్యాలతో బోట్లను త్వరలో అందుబాటులోకి తీసుకరానున్నట్లు పేర్కొన్నారు. వారికి టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్, నాగార్జున కొండ మ్యూజియం చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం డీఈ శ్రీనివాసరెడ్డి, బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, హరిత విజయవిహార్ మేనేజర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి


