శాలిగౌరారం: భార్య మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భర్త గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన శాలిగౌరారం మండలంలోని మాధారంకలాన్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మాధారంకలాన్ గ్రామానికి చెందిన మామిడి సైదులు(85), మామిడి ముత్తమ్మ(80) దంపతులు గత రెండు నెలలుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. వీరిని అదే గ్రామానికి చెందిన వారి కుమార్తె బందెల యాదమ్మ తన ఇంటివద్దనే ఉంచుకొని సపర్యలు చేస్తోంది. ఈ క్రమంలో ముత్తమ్మ శనివారం తెల్లవారుజామున 5 గంటలకు మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని చూసిన భర్త లేవలేని స్థితిలో మంచంలోనే తీవ్రంగా రోదించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ముత్తమ్మకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా తీవ్ర మనోవేదనకు గురైన భర్త సైదులు ఉదయం 11.30 గంటల సమయంలో గుండెపోటుతో మృతిచెందాడు. ఒకేరోజు భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఫ ఆరు గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు మృతి


