భువనగిరి : ‘ఈనెల మొదటి వారం నుంచే ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండలు అసాధారణ రీతిలో పెరగడం వల్ల ప్రజలు వడదెబ్బ, డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం పొంచి ఉంది’ అని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మనోహర్ అంటున్నారు. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజా రోగ్యం దృష్ట్యా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచామన్నారు. ఈ సందర్భంగా పలు వివరాలు వెల్లడించారు.
ప్రశ్న : ఎండదెబ్బ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి?
డీఎంహెచ్ఓ : ఎండ ప్రభావం వల్ల వడదెబ్బ మాత్రమే కాకుండా చిన్న పిల్లల్లో చెమటకాయలు, క్రీడాకారుల్లో కండరాల నొప్పులు, ఎక్కువ దూరం ప్రయాణించేవారికి కాళ్లవాపులు, కండరాలు బిగుసుకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
ప్రశ్న : ఎవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి?
డీఎంహెచ్ఓ : వేసవి కాలంలో ప్రధానంగా 5 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, బీపీ, షుగర్, గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలి.
ప్రశ్న : ఎలాంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ బారిన పడనిట్లుగా గుర్తించాలి?
డీఎంహెచ్ఓ : శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే పెరగడం, మతిస్థిమితం తప్పి పడిపోవడం, ఫిట్స్ రావడం, శ్వాస వేగంగా తీసుకోవడం, చర్మం పొడిబారి చాలా వేడిగా ఉండడం వంటివి వడదెబ్బ లక్షణాలుగా ఉంటాయి.
ప్రశ్న : వడడెబ్బ తగిలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డీఎంహెచ్ఓ : వడడెబ్బ బారిన పడిన వ్యక్తిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి తరలించి దుస్తులు వదులు చేయాలి. తడిగుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉష్ణోగ్రత తగ్గించాలి. స్పృహలో ఉంటే వెంటనే ఓఆర్ఎస్ తాగించాలి. అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలా చూడాలి
ప్రశ్న :వేసవిలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి?
డీఎంహెచ్ఓ : రోజుకు 8 నుంచి 10 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మజ్జిగ, పుచ్చకాయ, బత్తాయి రసాలు, పొటాషియం కోసం అరటి పండ్లను తీసుకోవాలి. తెల్లని వదులుగా ఉండే వస్త్రాలను ధరించాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రాకపోవడం మంచింది.
ప్రశ్న :వేసవి దృష్ట్యా జిల్లా వైద్యారోగ్య శాఖ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఎంహెచ్ఓ : జిల్లా స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించాం. జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పారాసిటమాల ట్యాబ్లెట్లను సిద్ధంగా ఉంచాం. ఉపాధి హా మీ పథకం కూలీలకు పనులు చేసే ప్రదేశంలో నీడ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించాం.
ఫ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఫ పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు
ఫ అప్రమత్తంగా ఉంటేనే ఆరోగ్యం
‘సాక్షి’తో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్


