టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టిన స్కూటీ.. ఒకరు మృతి
చౌటుప్పల్ : టీవీఎస్ ఎక్సెల్పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి స్కూటీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన ముస్కు మోహన్రెడ్డి(66) కుటుంబంతో కలిసి పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. రోజుమాదిరిగా ఆదివారం ఉదయం టీవీఎస్ ఎక్సెల్పై స్వగ్రామంలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి 11.30గంటల ప్రాంతంలో తిరిగి చౌటుప్పల్కు వస్తున్నాడు. ఈ క్రమంలో తంగడపల్లి దాటిన తర్వాత ఎర్ర స్థూపం వద్దకు రాగానే.. లింగారెడ్డిగూడేనికి చెందిన తొర్పునూరి చందు స్కూటీపై వెనుక నుంచి వేగంగా వచ్చి టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టాడు. దీంతో టీవీఎస్ ఎక్సెల్పై నుంచి మోహన్రెడ్డి ఎగిరి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
లైంగిక దాడి కేసులో
వ్యక్తి రిమాండ్
మర్రిగూడ: వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. వివరాలు.. మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన 60 ఏళ్ల పైబడిన వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడగా.. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి దేవరకొండ కోర్టులో హాజరుపర్చి అనంతరం నల్లగొండ జైలుకు రిమాండ్కు తరలించినట్లు నాంపలి సీఐ డి. రాజు, ఎస్ఐ ఎం. కృష్ణారెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరు మృతి
● మరొకరికి గాయాలు
ఆత్మకూరు(ఎం): మండలంలోని రాయిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. వివరాలు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన చెందిన కత్తుల వెంకన్న(55), మహబూబ్నగర్ జిల్లా అడ్డకల్ మండలం చక్రపూర్ గ్రామానికి చెందిన కొండూరు రాజు హైదరాబాద్లో ఉంటున్నారు. సోమవారం వారు పని నిమిత్తం తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామానికి బైక్పై వచ్చి తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నారు. మార్గమధ్యలో ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రా స్టేజీ సమీపంలో రోడ్డు క్రాసింగ్ వద్ద బైక్ అదుపుతప్పి చెట్ల పొదల్లోకి వెళ్లింది. దీంతో కత్తుల వెంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు. కొండూరు రాజు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.


