మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలోని దామరచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత గురువారం విచారణ చేపట్టారు. గురుకుల పాఠశాలలో విద్యార్థినులను మోకాళ్లపై నిలబెట్టడం, భోజనం విషయంలో ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరుపై పలు దినపత్రికల్లో కథనాలు రావడం, సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఆమె ఆకస్మికంగా పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. అంతకుముందు వాడపల్లి జెడ్పీహెచ్ఎస్ను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం మెనూ పరిశీలించారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలో ఈదులగూడ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో డిజిటల్ బోధనను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉందని అడిగారు. బీజేవైఎం నాయకుడు నేరెళ్ల అజయ్ పాఠశాలకు వచ్చిన సరుకులను పిల్లలతో మోయించారని కమిషన్ సభ్యురాలికి ఫిర్యాదు చేయగా.. ఇలాంటి ఘటనలు జరగకూడదని ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట బాలల హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ చింతా కృష్ణ, దామరచర్ల ఐసీడీఎస్ పీఓ ఎన్. చంద్రకళ, ఎంఈఓ డి. ధర్మానాయక్ తదితరులు ఉన్నారు.


