ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టొద్దు

Oct 1 2025 11:27 AM | Updated on Oct 1 2025 11:27 AM

ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టొద్దు

ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టొద్దు

సూర్యాపేటటౌన్‌ : అనవసరమైన లింక్‌లను అనుసరించి ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెట్టొద్దని సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ సూచించారు. సైబర్‌ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకున్న ముగ్గురి బాధితుల ఖాతాల్లో రూ.28లక్షల నగదును తిరిగి జమ చేయించి వారికి కోర్టు ఉత్తర్వులను మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాదారుడి మొబైల్‌ ఫోన్‌కు బిజినెస్‌ ఆఫర్‌ ఉందని మెసేజ్‌ వచ్చిందని, బాధితుడు మెసేజ్‌ను అనుసరిస్తూ సైబర్‌ నేరగాళ్లు సూచించిన విధంగా అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి సుమారు రూ.37 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పెట్టుబడి పెట్టిన అనంతరం ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్‌ సెక్యూరిటీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1930కి ఫిర్యాదు చేయగా.. సూర్యాపేట జిల్లా సైబర్‌ సెక్యూరిటీ సెల్‌, పట్టణ పోలీసులు అప్రమత్తమై సంబంధిత బ్యాంకు వారిని అతడి అకౌంట్‌ నుంచి బదిలీ అయిన నగదులో రూ.26.42 లక్షల నగదు హోల్డ్‌ చేయించినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆ నగదు మహారాష్ట్రకు చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పశ్చిమబెంగాల్‌కు చెందిన బంధన్‌ బ్యాంక్‌ వినియోగదారుల ఖాతాలకు బదిలీ అయ్యిందని గుర్తించి కోర్టు ఆర్డర్స్‌ ద్వారా తిరిగి బాధితుడికి ఇప్పించినట్లు తెలిపారు. ఇదేవిధంగా మరో వ్యక్తికి రూ.51వేల నగదు, ఇంకొక వ్యక్తికి రూ.90వేలు వారి అకౌంట్లలోకి వేసినట్లు ఎస్పీ వివరించారు. డబ్బులు తిరిగి పొందిన బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ సెక్యూరిటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ, కమ్యునికేషన్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మహేష్‌, కానిస్టేబుల్‌ మహేష్‌ చారి, రాజేష్‌, సైదులు, నాగయ్య పాల్గొన్నారు.

ఫ సూర్యాపేట ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement