
స్నాతకోత్సవానికి వేళాయే..
ఏర్పాట్లు పరిశీలించిన వీసీ
భారీ పోలీసు బందోబస్తు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి ముస్తాబైంది. స్నాతకోత్సవాన్ని సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో 12 కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఐఐటీ హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ బిఎస్.మూర్తి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ స్నాతకోత్సవంలో 22 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు, 57 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందించనున్నారు.
కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ
స్నాతకోత్సవం నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్రపవార్ ఇప్పటికే యూనివర్సిటీని సందర్శించి జిల్లా యంత్రాంగానికి, యూనివర్సిటీల బాధ్యులకు దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీలోనే వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా బాధ్యతలు అప్పగించారు.
పాస్ ఉంటేనే అనుమతి
స్నాతకోత్సవానికి యూనివర్సిటీలోకి విద్యార్థితో పాటు వారి వెంట కుటుంబ సభ్యుల్లో ఒకరిని లోపలికి అనుమతించనున్నారు. వేదికపై వారికి కేటాయించిన సీట్లలో మాత్రమే అతిథులు ఆసీనులు కావాల్సి ఉంటుంది. యూనివర్సిటీలోకి వెళ్లాలంటే వారికి ఇచ్చిన అనుమతి పత్రం (పాస్) తప్పనిసరిగా ఉండాలి. పాస్ లేకుంటే యూనివర్సిటీ లోపలికి భద్రతా సిబ్బంది అనుమతించరు. లోపలికి వెళ్లే అధ్యాపకులు, ఇతర సిబ్బంది వెంట పిల్లలను, ఫోన్లు, బ్యాగ్లు, కెమెరాలను కూడా అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.
ఎంజీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అలువాల రవి ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆడిటోరియంలో వేదికపైన ఏర్పాట్లకు సంబంధించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేయాలని నిర్వహకులను ఆదేశించారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించే స్నాతకోత్సవ ప్రాంతంలో పోలీసులు బాంబు స్క్యాడ్తో తనిఖీ చేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఒక డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూనివర్సిటీ లోపలికి వెళ్లే వారిని తనిఖీ చేసిన తరువాతనే అనుమతించనున్నారు. పాస్లు, గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే స్నాతకోత్సవ వేడుకకు అనుమతిస్తామని ఇప్పటికే ఎస్పీ శరత్చంద్రపవార్ స్పష్టం చేశారు.
నేడు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వేడుక
ఫ ముఖ్య అతిథిగా హాజరుకానున్న
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ
ఫ పీహెచ్డీ పట్టాలు అందుకోనున్న
22 మంది విద్యార్థులు
ఫ 57 మందికి బంగారు పతకాలు
అందజేయనున్న గవర్నర్
ఫ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన 12 కమిటీలు

స్నాతకోత్సవానికి వేళాయే..