
కేసు నమోదు
మోతె : వినాయక నిమజ్జన వేడుకల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, పోలీసుల అనుమతి లేకుండా డీజే వినియోగించిన నిర్వాహకులపై కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలో పోలీసుల అనుమతి లేకుండా సోమవారం రాత్రి వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే వినియోగించారు. దీంతో వేడుకల నిర్వాహకుడు పులగుజ్జు కార్తీక్, ఆర్గనైజర్ కోడి మహేష్పై కేసు నమోదు చేసి డీజే, వాహ నం సీజ్ చేసినట్లు మోతె ఎస్ఐ టి.అజయ్కుమార్ గురువారం తెలిపారు.
ఆర్టీసీలో ‘యాత్రాదానం’
రామగిరి(నల్లగొండ) : యాత్రాదానం పేరుతో వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్ పథకం కింద కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలు సామాజిక బాధ్యతతో వృద్ధులు, దివ్యాంగులకు రవాణా సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థుల పుట్టిన రోజు వేడుకలు, శుభకార్యాలకు ప్రత్యేక బస్సుల్లో వారిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఈ పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సంస్థకు విరాళాలు అందిస్తే యాత్రాదాన నిధి కింద ప్రత్యేక ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. దాతలు టీజీఎస్ఆర్టీసీ పోర్టల్, క్యూఆర్ కోడ్ యూపీఐ ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు.
సిలిండర్లు స్వాధీనం
చౌటుప్పల్ : అక్రమంగా నిల్వ ఉంచిన వంటగ్యాస్ సిలిండర్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. వంటగ్యాస్ సిలిండర్లలోని గ్యాస్ను చిన్న సిలిండర్లలోకి నింపి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు చౌటుప్పల్ పట్టణంలోని రత్నానగర్కాలనీలో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉన్న తడకమళ్ల రామలింగస్వామి మడిగెలో సోదాలు చేశారు. అందులో నిల్వ ఉంచిన 13 సిలిండర్లు, వెయింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ఎరువుల డీలర్లపై కేసు
గుర్రంపోడు : గుర్రంపోడు మండల కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారి కంచర్ల మాధవరెడ్డి తన సిబ్బందితో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో అధిక ధరలకు యూరియా విక్రయించిన ముగ్గురు డీలర్లపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పసుపులేటి మధు తెలిపారు. యూరియా బస్తా ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా రూ.266 లకు విక్రయించాల్సి ఉండగా కొంతమంది రైతుల వద్ద రూ.300 తీసుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో శరవణ ఫర్టిలైజర్ యజమాని ఎర్ర శ్రీనివాసరావు, శ్రీలక్ష్మీ ఫర్టిలైజర్ యజమాని బొమ్ము ఆనంద్, సాయిరాం ఏజెన్సీ యజమాని చందా గోవింద్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.