
బియ్యం నిల్వలో తేడాపై విచారణ!
ఆలేరు : పట్టణ పరిధిలోని సివిల్ సప్లై గోదాములో బియ్యం నిల్వల్లో వ్యతాసం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు శుక్రవారం పౌరసరఫరాల శాఖ అధికారులు గోదామును సందర్శించి విచారణ చేశారు. స్టాక్ రికార్డులను పరిశీలించారు. బియ్యం నిల్వలో తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా గోదాము ఇంచార్జ్ కొంతకాలం క్రితం బదిలీపై వెళ్లారు. అతని స్థానంలో మరొకరు బాధ్యతలు స్వీకరించారు.
బునాదిగాని కాల్వకు
నీటి నిలిపివేత
భువనగిరి : బునాదిగాని కాల్వకు మూసీ నుంచి తాత్కాలికంగా నీటి విడుదల నిలిపివేయనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాల్వ గేట్ల నిర్మాణ పనుల నేపథ్యంలో ఈనెల 10నుంచి జూలై 10వ తేదీ వరకు నీటి విడుదల నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు ముందుగానే తగిన ప్రణాళిక రూపొందించుకుని అధికారులకు సహకరించాలని కోరారు.
లెసెన్స్ సర్వేయర్ల శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మీసేవ కేంద్రాల ద్వారా ఈనెల 17 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఇంటర్లో గణితంశాస్త్రం అంశంగా ఉండి కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. భువనగిరిలోని తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 50 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. వివరాలకు 91777 73713, 96400 43847 నంబర్లను సంప్రదించాలని కోరారు.
జూలూరు పీఏసీఎస్ సీఈఓ సస్పెన్షన్
భూదాన్పోచంపల్లి : జూలూరు పీఏసీఎస్ సీఈఓ రెబ్బాస్ నర్సింహపై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలం జూలూరు. అలీనగర్లోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోళ్ల తీరు, మాయిశ్చర్ యంత్రం ద్వారా ధాన్యం తేమశాతం పరిశీలించారు. కాగా అలీనగర్ కొనుగోలు కేంద్రంలో రైతులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొనుగోలు చేయడానికి అవసరమైన తేమ శాతం వచ్చినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, హమాలీలను ఏర్పాటు చేయలేదని, సీఈఓ, అధికారులు ఇప్పటివరకు కేంద్రాన్ని సందర్శించలేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఈఓను సస్పెండ్ చేశారు. కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తుండాలని డీసీఓను ఆదేశించారు.
వంగడాల ఎంపికే కీలకం
భూదాన్పోచంపల్లి : మూసీ ఆయకట్టులో వంగడాల ఎంపిక కీలకమని వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్రాజు పేర్కొన్నారు. ఆర్ఎన్ఆర్ 28361, కేపీఎస్ 2874, ఆర్ఎన్ఆర్ 11718, కేపీఎస్ 6251 రకాలు అనువైనవన్నారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలం భీమనపల్లి రైతువేదికలో నిర్వహించిన రైతుల ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని రైతులకు సలహాలు, సూచనలు చేశారు. పంట మార్పిడి విధానాలు అవలంభించాలన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి జీలుగ విత్తనాలు, పచ్చిరొట్టతో భూసారం పెంచుకోవాలని కోరారు. జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ మాట్లాడుతూ వరి కొయ్యలు కాల్చవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సుజాత, డాక్టర్ సమత, భువనగిరి ఏడీఏ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్రెడ్డి, వైస్ చైర్మన్ సామమోహన్రెడ్డి, చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మర్రి రాజిరెడ్డి, సుర్వి వెంకటేశ్గౌడ్, ఏఓ శైలజ, ఏఈఓలు రాజేశ్, నరేశ్, రైతులు కందాడి సుధాకర్రెడ్డి, ఆదిమూలం శ్రీను, కల్కూరి పాండు తదితరులు పాల్గొన్నారు.

బియ్యం నిల్వలో తేడాపై విచారణ!