
తరలివచ్చి.. వినతులిచ్చి
ఫ ప్రజావాణిలో 50కి పైగా అర్జీలు
ఫ సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ను వేడుకున్న ప్రజలు
హామీలు అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు కోరారు. ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నెలకు రూ.30వేలు పెన్షన్ ఇవ్వాలని, సమరయోధులుగా గుర్తించి గుర్తింపుకార్డులు జారీ చేయాలని, 250 గజాల ఇంటిస్థలం కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. జార్ఖండ్ తరహాలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులుగా గుర్తించి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సంగిశెట్టి క్రిష్టపర్, సింగిశెట్టి జనార్దన్, మటె లింగయ్య, అవిశెట్టి రమేష్ పాల్గొన్నారు.
భువనగిరిటౌన్ : బస్సు సౌకర్యం లేదని, భూములు ఆక్రమించారని, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని.. ఇలా వివిధ సమస్యలపై ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజవాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చిన అర్జీలు అందజేశారు. ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ హనుమంతరావు అర్జీలు స్వీకరించి ఆయా శాఖలకు రెఫర్ చేశారు. 50కి పైగా అర్జీలు రాగా అందులో అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించి 29 అర్జీలు ఉన్నాయి. పంచాయరాజ్ 8, సర్వే ల్యాండ్స్ 3, హౌసింగ్ 2, ఆర్టీసీ 2, లేబర్, విద్యశాఖ, ఇంటర్మీడియట్ , జిల్లా గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించి ఒక్కొకటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
సత్వర పరిష్కారం చూపండి
ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని, బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు రూ.లక్ష, స్లాబ్ పూర్తయితే రూ.2లక్షలు, ఆ తదుపరి రూ.2లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందన్న విషయాన్ని తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్ పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● భువనగిరి మండలం రెడ్డినాయక్తండా పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన భూక్యా రఘు విన్నవించారు.
● రామన్నపేటలోని ధోబిఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రామన్నపేట మండల రజక సహకార సంఘం ప్రతినిధులు కోరారు.
● బీబీనగర్ మండలం నెమరగొముల గ్రామంలో 115 ఎకరాల భూదాన భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని రక్షించాలని కోరుతూ భువనగిరికి చెందిన ఖాజా ఖుత్బుద్ధీన్ కలెక్టర్ను కోరారు. వినతిపత్రం అందజేశారు. విచారణ జరిపించి అక్రమారులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
స్కూల్ బస్సులను అద్దెకు ఇవ్వకుండా చూడాలని వినతి
పాఠశాలల బస్సులు వివాహాది శుభకార్యాలకు అద్దెకు ఇవ్వకుండా చూడాలని ట్రావెల్స్ బస్సుల యజమానులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఒక్క బస్సుకు సంవత్సరానికి రూ.2 లక్షల వరకు ట్యాక్స్, రూ.60 వేలకు పైగా ఇన్సురెన్స్ చెల్లిస్తున్నామని, కిరాయిలు లేకపోవడంతో కుటుంబసభ్యుల బంగారు అబరణాలు కుదువపెట్టి ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల యజమానులు రిజిస్ట్రేషన్ లేకపోయినా అద్దెకు ఇస్తున్నారని, పైగా తక్కువ చార్జి తీసుకుంటున్నారని.. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. వెంటనే స్కూల్ బస్సుల పర్మిట్లు రద్దు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కంచర్ల వెంకట్, జంగారెడ్డి, అంబటి సుధాకర్, పెండెం బాలనర్సింహ, లవణ్, కూనుజు నర్సంహాచారి, మైలారం నర్సింహా, పన్నల మల్లారెడ్డి ఉన్నారు.
ప్రజావాణిలో న్యాయవాది నియామకం
భూ సమస్యలు, ఇతర న్యాయపరమైన కేసులకు సంబంధించి అర్జీలు పెద్ద ఎత్తున వస్తున్నందున ఇకపై ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ నుంచి ఒక అడ్వకేట్ పాల్గొంటారు. బాధితులకు లీగల్ అడ్వైజ్ ఇవ్వడంతోపాటు కోర్టు కేసులకు సంబంధించిన అర్జీల స్థితిగతులను తెలియజేయనున్నారు.

తరలివచ్చి.. వినతులిచ్చి

తరలివచ్చి.. వినతులిచ్చి