
వరి గడ్డి ధర రెట్టింపు
భువనగిరి, రామన్నపేట : వరి గడ్డి బంగారంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటడంతో వేలాది ఎకరాల్లో వరి చేలు ఎండిపోయాయి. దీంతో వానాకాలం సీజన్ పూర్తయ్యే దాకా ఎండుగడ్డిని భద్రపరుచుకునే అవసరం పాడి రైతులకు ఏర్పడింది. ముందు జాగ్రత్తగా గడ్డి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు.
2,91,000 ఎకరాల్లో వరి సాగు
యాసంగిలో 2,91,000 ఎకరాల్లో వరిసాగు చేశారు. మూసీ పరీవాహకంలో వరి నాట్లు కొంత ఆలస్యం కాగా.. మూసీ పరివాహకేతర ప్రాంతాల్లో ముందుగానే నాట్లు వేశారు. దీంతో మూసీ పరీవాహకేతర ప్రాంతాల్లో 15 రోజుల క్రితం నుంచే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు లేకపోవడం, ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతుండడంతో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో బావులు, బోర్లు వట్టిపోయి సాగునీరందక వేలాది ఎకరాల్లో వరి చేలు ఎండిపోయాయి. ఎండిన పంటను రైతులు పశువులు, జీవాలకు వదిలారు. దీంతో ఎండుగడ్డికి డిమాండ్ ఏర్పడింది.
గత ఏడాది, ఈసారి ధర ఇలా..
వర్షాలు సమృద్ధిగా కురిసిన సంవత్సరం ఎండుగడ్డికి అంతగా డిమాండ్ ఉండదు. చాలామంది రైతులు అమ అవసరాలకు కొంత నిల్వ చేసుకుని, మిగతా గడ్డిని పొలంలోనే కలియదున్నేవారు. కానీ, ఈ యాసంగి సీజన్లో నెలకొన్న పరిస్థితుల వల్ల ఎండుగడ్డికి డిమాండ్ పెరిగింది. గత ఏడాది యాసంగిలో ఎకరం గడ్డి రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయించారు. ప్రస్తుతం ఎకరం గడ్డి రూ.1000 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. కట్టలెక్కన గతంలో రూ.100 ఉండగా ప్రస్తుతం రూ.150 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు. ప్రధానంగా మూసీ పరివాహకేత ప్రాంతాల్లో బోరు బావుల కింద పండే వరి గడ్డిని పశువులు ఎక్కువగా మేస్తాయి. దీంతో ఈ గడ్డికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
వ్యాపారంగా మారిన గడ్డి
ఎండుగడ్డి వ్యాపారంగా మారింది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారుల అవతారం ఎత్తారు. వరి కోతలు ప్రారంభించకముందే వ్యాపారులు ముందుగానే గడ్డి బుక్ చేసుకుంటున్నారు. ఆ తరువాత వివిధ ప్రాంతాల రైతులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇది వ్యాపారులకు ఉపాధిగా మారింది.
ధర పెరిగింది
బోరు అడుగంటడంతో యాసంగిలో సాగు చేసిన వరి చేను పూర్తిగా ఎండిపోయింది. దీంతో పశువులకు గడ్డి కోనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వానాకాలం గడ్డి వచ్చే వరకు సుమారు 3 ఎకరాల గడ్డి అవసరం అవుతుంది. కొనుగోలు చేసేందుకు వెళ్తే ఎకరానికి రూ.వెయ్యికి పైనే చెబుతున్నారు. గతంలో ఎకరం గడ్డి రూ.500లకే వచ్చేది.
–వనగంటి రవీందర్, రైతు పహిల్వాన్పురం
ఫ అడుగంటిన భూగర్భ జలాలు.. వేలాది ఎకరాల్లో ఎండిన చేలు
ఫ ముందస్తు జాగ్రత్తగా గడ్డి కొనుగోలు చేస్తున్న పాడి రైతులు
ఫ ఎకరం విస్తీర్ణంలోని గ్రాసానికి రూ.1,000 నుంచి
రూ.1,200 వరకు డిమాండ్
ఇతర జిల్లాల నుంచి..
ఆత్మకూర్(ఎం), మోత్కూరు, ఆలేరు, రాజాపేట, అడ్డగూడూరు, గుండాల, భువనగిరి, వలిగొండ, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడి గడ్డి నాణ్యవంతంగా ఉంటుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న సిద్ధిపేట, మెదక్, మేడ్చల్ జిల్లాల రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్లు, డీసీఎంలు, ఆటోల్లో తరలిస్తున్నారు.

వరి గడ్డి ధర రెట్టింపు

వరి గడ్డి ధర రెట్టింపు