ఆకివీడు: రొయ్య రైతులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు కృత్రిమ సమస్యలు, మరొకవైపు ప్రకృతి విపత్తులతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న మొన్నటి వరకు రొయ్యల ధరలు తగ్గడం, ఆ తర్వాత మేత ధరలు పెరగడం, ఆపై విద్యుత్ కోతలు, బకాయి బిల్లులు, వైరస్ల దాడితో ఆక్వా రైతులు అన్ని విధాలుగా నలిగిపోతున్నారు. ప్రకృతి కనికరించినా, ప్రభుత్వం ఆదుకోవడం లేదని వాపోతున్నారు.
సబ్సిడీ విద్యుత్ ఎప్పుడో?
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసిన తర్వాత సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ, నెలన్నర రోజులు గడిచినా అది ఆచరణలోకి రాలేదు.
కోతలు : చెరువులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్న హామీని ప్రభుత్వం నీరుగార్చిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతున్న రైతులకు అప్రకటిత విద్యుత్ కోతలు పిడుగుపాటులా మారాయి. కొన్ని గ్రామాల్లో కోతకు వచ్చిన రొయ్యలు, మరికొన్ని చోట్ల 80–100 కౌంట్లో ఉండి ఎదుగుతున్న రొయ్యలకు విద్యుత్ కోతల వల్ల ఆక్సిజన్ అందక చనిపోయే ప్రమాదం ఏర్పడింది. రాత్రి, పగలు తేడా లేకుండా 2 నుంచి 3 గంటల పాటు నిరంతరంగా కోతలు విధిస్తుండటంతో, జనరేటర్లు వాడకపోతే రొయ్యలు చనిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 24 గంటల ఉచిత కరెంట్ అని చెప్పి నిండా ముంచుతున్నారని వాపోతూ, ఇప్పటికై నా నిరంతర విద్యుత్ సరఫరా చేసి తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.
అప్రకటిత కోతలతో రైతుల ఆందోళన


