ఏలూరు (ఆర్ఆర్పేట): తలనీలాల ఎగుమతులు వృద్ధి చెందడానికి, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం పొందడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని శాసన మండలి సభ్యులు, ప్రముఖ తలనీలాల ఎగుమతిదారు వంక రవీంద్రనాథ్ అన్నారు. శుక్రవారం కేంద్ర సంస్థ డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ప్లాస్టిక్స్ ఎగుమతి ప్రోత్సాహక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణ సామర్థ్యం– తల నీలాల ఎగుమతులు –సాంకేతిక అభివృద్ధి అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో దక్షిణ భారత దేశం నుంచి తలనీలాల ఎగుమతి దారులు పాల్గొన్నారు. తలనీలాల ఎగుమతి ద్వారా అనేక వేలమంది అనేక రాష్ట్రాలలో ఉపాధి పొందుతున్నారని, విగ్గులు, తదితర హెయిర్ ప్రొడక్ట్స్ తయారీలో భారతదేశ ఎగుమతిదారులు వెనుకబడి ఉన్నారని, ఈ తయారీ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడాని ప్రభుత్వ సాయం కావాలని రవీంద్రనాథ్ కోరారు. విశాఖపట్నం డిప్యూటీ డీజీఎఫ్టీ కార్యాలయం నుంచి వచ్చిన పలని ఫణి కుమార్ ఎగుమతి దారుల సమస్యలు ఉన్నతాధికార కార్యాలయానికి తెలియపరుస్తానని, ప్రస్తుతం చిన్న, సూక్ష్మ ఎగుమతి దారులకు కలగబోయే ప్రోత్సాహకాల గురించి వివరించారు. ప్లెక్స్ కౌన్సిల్ రీజనల్ డైరెక్టర్ రూబిన్ హోబ్డే మాట్లాడుతూ తలనీలాల ఎగుమతులకు ఏలూరు, తణుకు ముఖ్య కేంద్రాలని, కౌన్సిల్ ద్వారా సమస్యలు లేకుండా చేస్తామని చెప్పారు. హెయిర్, హెయిర్ ప్రొడెక్ట్స్ అసోసియేషన్ ఛైర్మన్ బెంజమిన్ చెరియన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మడుపల్లి మోహన్ గుప్తా, కేకే గుప్తా, సతీష్ గాంధీ, కిషోర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
నిడమర్రు: గ్రామాల్లో నిర్వహిస్తున్న సందర్శన సభల్లో స్వీకరిస్తున్న అర్జీలపై తక్షణం అధికారులు స్పందించి పరిష్కరించేలా కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఒక నెల, ఒక గ్రామం, నాలుగు సార్లు సందర్శన కార్యక్రమం రెండో సారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొని పలు సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముందుగా పలు గ్రామాల్లోని అభివృద్ధి, ప్రధాన సమస్యలు, రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పీహెచ్సీ అభివృద్ధిపై దృష్టి
నిడమర్రు సభ అనంతరం పెదనిండ్రకొలను, పత్తేపురం గ్రామాల్లో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, తదితరులు పర్యటించి పలు సమస్యలను తెలుసుకున్నారు. పెదనిండ్రకొలను గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని పరిశీలించి వైద్య అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అఽధికారులను కోరారు. పెదనిండ్రకొలను పందికోడు కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే పనులు త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పత్తేపురంలో నూతన పంచాయతీ భవనం నిర్మాణం చేపట్టాలన్నారు. పత్తేపురం తాగునీటి పథకం మంచినీటి చెరువు ప్రక్షాళన పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.రంగలక్ష్మి, ఎంపీడీఓ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.


