శుభ్రమైన నీటితోనే నింపాలి
ఏలూరు (టూటౌన్): అపరిశుభ్రమైన ప్రస్తుత కృష్ణా నది జలాలను పంపుల చెరువులో నింపొద్దని నగర ప్రజలు కోరుతున్నారు. ఏలూరు ప్రజానీకానికి వేసవి దాహార్తిని తీర్చేందుకు పంపుల చెరువు నింపడం కోసం విజయవాడ నుంచి కృష్ణా నది జలాలను కిందికి, ఏలూరు కృష్ణా కెనాల్ లోకి వదిలారు. అయితే ప్రస్తుతం కృష్ణా కెనాల్లోకి వస్తున్న, కాలువలో ప్రవహిస్తున్న నీరు చాలా అపరిశుభ్రంగా, కలుషితంగా, దుర్వాసనతో మురుగు నీటిలా ఉన్నాయి. ఈ అపరిశుభ్రమైన నీటిని పడమటి లాకుల ద్వారా కిందికి వదిలి పరిశుభ్రమైన నీరు వచ్చిన తర్వాతనే పంపుల చెరువులు నింపాలని ఐఎఫ్టీయూ ఏలూరు నగర కమిటీ మున్సిపల్, ప్రభుత్వ అధికారులను కోరింది. ఈ మేరకు ఐఎఫ్టీయూ బృందం ఆదివారం పడమటిలాకుల వద్ద కృష్ణా కెనాల్ నీటిని పరిశీలించారు. అనంతరం పంపుల చెరువు వద్ద నీటిని పరిశీలించారు.
మూడు నెలల తర్వాత కృష్ణా కాలువకు నీరు
ఏలూరు నగరానికి గోదావరి, కృష్ణా జలాలలతో వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ఒక పక్క అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే కృష్ణా కాలువకు విజయవాడ ఎనికేపాడు వద్ద బుడమేరుకు అండర్ టన్నెల్ నిర్మిస్తున్న కారణంగా గత మూడు నెలలుగా ఏలూరుకు వచ్చే కృష్ణా కాలువను మూసివేశారు. ప్రస్తుతం వేసవిలో దిగువ ప్రాంతాల్లోని తాగునీటి చెరువులకు నీటిని అందించే ఉద్దేశ్యంతో ఇటీవల నీటిని విడుదల చేశారు. కానీ ఎగువ ప్రాంతంలో కాలువలో ఉన్న వ్యర్థాల కారణంగా దిగువ ఏలూరు వచ్చేసరికి కృష్ణా కాలువ నీరు కలుషితంగా మారుతోంది. ఈనెల 7వ తేదీ సాయంత్రానికి ఏలూరు చేరుకున్న కృష్ణా నీరు పంపుల చెరువులోకి తోడేందుకు పనికి రాకుండా పోయింది.
తాగునీటికి పనికిరావంటూ రిపోర్టు
ప్రస్తుతం కృష్ణా కాలువలో వస్తున్న నీరు తాగునీటికి పనిరావంటూ ల్యాబ్ రిపోర్టు వచ్చినట్లు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. మురుగు నీరు ఆగిపోయిన తర్వాతనే కృష్ణా కాలువ నీటిని పంపుల చెరువులోకి తోడటం జరుగుతుందని అంటున్నారు. మరో పక్క కాలువలోకి కొద్ది రోజులు మాత్రమే నీరు విడుదల చేస్తారనే కారణంగా చెరువును నింపేందుకు మున్సిపల్ అధికార యంత్రాంగం తొందర పడుతున్నట్లు కన్పిస్తోంది. అయితే మురుగు నీరు పూర్తిగా దిగువ కొల్లేరులోకి వదిలేసిన తర్వాతనే శుభ్రమైన నీరు వచ్చాకే పంపుల చెరువులోకి నీటిని మళ్లించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
తాగునీరు.. తాగలేరు
ప్రస్తుతం కృష్ణా కాలువలో కలుషిత వ్యర్థాలతో కూడిన నీరు ప్రవహిస్తోంది కాలువలో పరిశుభ్రమైన నీరు వచ్చాకనే కృష్ణా నీటిని పంపుల చెరువులోకి నింపాలి. లేని పక్షంలో ఉన్న నీరు మొత్తం కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. గతంలో ఏలూరు ప్రజలు తెలియని వింత రోగాలతో బాధపడిన సంఘటన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుని జాగ్రత్తలు పాటించాలి.
– బి.సోమయ్య, నగర అధ్యక్షుడు, ఇఫ్టూ ఏలూరు నగర కమిటీ, ఏలూరు
డ్రెయినేజీ నీటిని తలపిస్తున్న కృష్ణా నీరు
ఆ నీటినే పంపుల చెరువులోకి నింపేందుకు సిద్ధమవుతున్న యంత్రాంగం
మురుగు నీరు నింపడంపై నగరవాసుల్లో ఆందోళన
స్వచ్ఛమైన నీటినే చెరువులోకి పంపింగ్ చేయాలని డిమాండ్


