పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
నరసాపురం: ప్రభుత్వ విద్యావ్యవస్థ తీరుకు మొగల్తూరు మండలం కాళీపట్నం వెస్ట్ పంచాయతీలో ఉన్న మోడల్ ప్రైమరీ పాఠశాల దుస్థితి అద్దం పడుతోంది. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 49 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో ఒకే ఒక్క గది మాత్రమే ఉండటంతో విద్యార్థులందరినీ ఒకే చోట కూర్చోబెట్టి ఉపాధ్యాయులు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠాలు చెప్పడానికి ఉన్న నలుగురు ఉపాధ్యాయులు కనీసం నిలబడటానికి స్థలం లేని పరిస్థితి. దీంతో కొంతమంది పిల్లలను స్కూల్ అరుగు మీద కూర్చోబెట్టి, బయట ఎండ తగలకుండా డేరా కట్టి చదువులు చెబుతున్నారు. పాఠశాల పక్కనే పాడుబడిన పాత భవనం ఉంది. సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేసి దానికి మరమ్మతులు చేయిస్తే మరో తరగతి గది అందుబాటులోకి వస్తుందని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు, విద్యాశాఖ అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న కాళీపట్నం మోడల్ ప్రైమరీ పాఠశాల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


