పీవీఎల్. నర్శింహరాజు, ఉండి వైఎస్సార్సీపీ ఇన్చార్జి
ఆకివీడు: తన అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కుటుంబ కలహాలను తెరపైకి తీసుకువస్తున్నారని, జగన్ కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్రంలో సంచలనాలు సృష్టించాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు విమర్శించారు. ఎల్లో మీడియా అండదండలతో కుటుంబాల మధ్య కలహాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. సూపర్ సిక్స్ అట్టర్ప్లాప్ అయిందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అడ్రస్సులే కుండా పోయాయని ఆరోపించారు. కరోనాలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని వసతులూ కల్పించారన్నారు. ఎక్కడో యుద్ధం జరిగితే రాష్ట్రం అతలాకుతలమైపోతుందన్నారు. గ్యాస్ కొరతతో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. టీ స్టాల్స్, బిర్యానీ పాయింట్లు, ఇతర చిరు వ్యాపారాలు మూతపడ్డాయన్నారు. ఉండి నియోజకవర్గంలో రెడ్బుక్ పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఎదురు చెప్పితే కేసులు, హెచ్చరికలు, దాడులు చేస్తున్నారన్నారు. ఎవరైనా ఎదురు చెబితే బొక్కలో వేస్తాం అన్నదే తమ సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.


