వైభవంగా శ్రీవారి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం జరిగిన స్వామివారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేష పుష్పమాలికలతో అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం తిరువీధి సేవకు పయనమైంది. అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, అశ్వ, గజ సేవల నడుమ స్వామివారు క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగారు. ప్రతి ఇంటి ముంగిట భక్తులు శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు విశేష పూజలు జరిపి, భక్తులకు తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు.


