
ఆర్టీసీ ప్రత్యేక యాత్రా బస్సులు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల్లో ఆదివారం నుంచి పంచారామ క్షేత్రదర్శిని టూర్ ప్యాకేజీ ప్రారంభించామని జిల్లా ప్రజా రవాణాధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ తెలి పారు. ఇంద్ర రూ.1,600, అల్ట్రా డీలక్స్ రూ. 1,100, సూపర్ లగ్జరీ రూ.1,200లుగా చార్జీలు ఉంటాయన్నారు. కార్తీక మాసంలో భక్తులు ఒకేరోజు పంచారామాలు దర్శించుకునేలా బస్సు సర్వీసులు ఏర్పాటుచేశామన్నారు. అలాగే ఎక్కడి నుంచైనా 40 మంది భక్తులు ఉంటే అదనపు చార్జీలు లేకుండా బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీశైలం స్పెషల్ సర్వీసులు, అయ్యప్ప భక్తుల కోసం శబరిమలైకు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. ప్రతి పౌర్ణమి రోజు అరుణాచలం గిరి ప్రదక్షణ, దర్శన సమయాలకు చేరువిధంగా అరుణాచల యాత్ర స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టు చెప్పారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో నెల రోజులపాటు నిర్వహించిన సూపర్ జీ ఎస్టీ–సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ముగింపు సభ ఆదివారం భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
జంగారెడ్డిగూడెం: ఖరీఫ్ సీజన్లోని పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాలు తెరవాలని, పత్తి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో శనివారం జరిగిన రైతు సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిర్ణయించిన క్వింటాల్కు రూ.8,110 మద్దతు ధర రైతులకు దక్కే పరిస్థితి లేదన్నారు. పత్తి వ్యాపారులు రకరకాల పద్ధతుల్లో క్వింటాలుకు రూ.ఆరేడు వేలకు మించి ధర ఇవ్వకుండా రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. తక్షణమే సీసీఐ కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని, క్వింటాల్కు రూ.10,500 మద్దతు ధర ప్రకటించాలని కోరారు.
నూజివీడు: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయటాన్ని అందరూ వ్యతిరేకరించాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.హరినాథ్ శనివారం ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక కారణాల సాకుగా విద్య, వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటం బాధ్యతా రాహిత్యమేనన్నారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగించడం ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లుపోడవటమేనని, సామాన్య ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడమేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం కొనసాగాలని చంద్రబాబు ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు న్యాయపరంగా కూడా అడ్డుకుంటామని పేర్కొన్నారు.

ఆర్టీసీ ప్రత్యేక యాత్రా బస్సులు