
నటుడు అల్లం గోపాలరావు మృతి
భీమడోలు : సినీ, టీవీ ఆర్టిస్ట్ అల్లం గోపాలరావు(75) శనివారం హైదరాబాద్లో కన్నుమూశారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన ఆయన మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గోపాలరావుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్నేహితుడు. ఆయన సహకారంతో రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ వెళ్లి టీవీ, సినిమాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. గోపాలరావు భీమడోలులోని సుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పని చేసేవారు. గ్రామంలోని గురజాడ కళావేదిక వద్ద క్రీడా పోటీలు నిర్వహించేశారు. అభ్యుదయ వాదిగా అనేక చైతన్య కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేశారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నాటికలు, ప్రదర్శనలు ఇచ్చారు.
గోపాలరావు మృతికి నివాళి
ఏలూరు (ఆర్ఆర్పేట): గోపాలరావు మృతికి సీపీఐ, ప్రజా నాట్యమండలి, బీకేఎంయూ జిల్లా సమితులు ఓ ప్రకటనలో సంతాపం తెలిపాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ప్రజానాట్యమండలి ఏలూరు ఏరియా కార్యదర్శి తమ్మా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గోపాలరావు తొలినాళ్లలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజానాట్యమండలిలో ప్రముఖ పాత్ర నిర్వహించారన్నారు. సమాజంలో మార్పునకు కృషి చేశారన్నారు. అభ్యదయ భావాలు కలిగిన గోపాలరావు మృతి కళా రంగానికి తీరని లోటన్నారు.