
జిల్లా జడ్జికి అభినందనలు
ఏలూరు (టూటౌన్): జిల్లా ప్రధాన సివిల్ న్యాయమూర్తిగా (ప్రిన్సిపల్ డిస్ట్రిక్ జడ్జి) పదవీ బాధ్యతలు స్వీకరించిన సిరిపురం శ్రీదేవిని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆమెకు పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజల న్యాయ అవసరాలు తీర్చేందుకు సంబంధిత విభాగాల మధ్య సమన్వయంతో కేసుల విచారణ, మహిళా భద్రత, నేర నిరోధక చర్యలపై వారు చర్చించారు. పోలీస్శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ శివకిషోర్ ఆమెకు వివరించారు.
ఫిర్యాదులపై సత్వర చర్యలు
భీమవరం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన ఫిర్యాదులపై విచారణ చేసి చట్టపరిధిలో పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బాధితులకు భరోసా ఇచ్చారు. సోమవారం పీజీఆర్ఎస్లో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలు ఆయన తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు, అత్తింటి వేధింపులు, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు వంటి 23 అర్జీలను స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై విచారణ చేయాలని అధికారులకు ఫోన్లో ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
రీ ఓపెన్ అయిన అర్జీలపై సమీక్ష
భీమవరం(ప్రకాశం చౌక్): రీ ఓపెన్ అయినా అర్జీల విషయంలో మరింత జవాబుదారీతనం కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సోమ వారం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలు, రీ ఓపెన్ అయిన అర్జీలపై సమీ క్షించారు. అధికారులు తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుడికి లేఖ ద్వారా తెలియజేయాలన్నారు. జిల్లాలో 927 ఫిర్యాదులు రీఓపెన్ కాగా 821 ఫిర్యాదులను పరిష్కరించామని, 106 పెండింగ్లో ఉన్నాయన్నారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలన్నారు.
పేదల ఇళ్ల కూల్చివేత దారుణం
భీమవరం అర్బన్: పాలకోడేరులోని ఏఎస్ఆర్ నగర్లో 60 ఏళ్లుగా 130 కుటుంబాలు ఉంటున్నాయని, వారి ఇళ్లను కూటమి ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేయడం దారుణమని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఇంజేటి శ్రీనివాస్, నాయకులు ఎం.ఆంజనేయులు అన్నారు. మండలంలోని తోకతిప్పలో సోమవారం ఇళ్ల కూల్చివేతపై సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రభుత్వం అని చెబుతూనే పేదల ఇళ్లను కూలగొట్టి రోడ్డున పడేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా అని ప్రశ్నించారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వైఖరి మార్చుకోవాలని, ప్రజలపై దాడులు మాని భూస్వాముల చేతుల్లో ఆక్రమణకు గురైన భూముల్ని వెలికితీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ప్రజలే బుద్ధి చెబు తారని హెచ్చరించారు. సీపీఎం శాఖ కార్యదర్శి బొడ్డు లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
24 నుంచి ఉపాధ్యాయులకు వైద్య శిబిరం
ఏలూరు (ఆర్ఆర్పేట): పూర్వ పశ్చిమగోదా వరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రిఫరెన్షియల్ కేటగిరీ/స్పెషల్ పాయింట్లు పొందాల్సిన వారు వైద్య శిబిరాలకు హాజరుకావాలని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి 26 వరకు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుందని తెలిపారు.

జిల్లా జడ్జికి అభినందనలు

జిల్లా జడ్జికి అభినందనలు