
పొట్టకూటి కోసం వెళితే..
నరసాపురం: తోటి వ్యక్తులతో కలిసి ఉదయాన్నే పనుల్లో నిమగ్నమైన ఆ ఉపాధి కూలీల బతుకులు అనుకోని ప్రమాదంతో తెల్లారిపోయాయి. టాటా ఏస్ వాహనం రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ పనిచేస్తున్న మిగిలిన ఉపాధి కూలీలంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఒకరి అతివేగం రెండు నిండు ప్రాణాలను పొట్టనబెట్టుకోగా మరో ఇద్దర్ని గాయాలపాలు చేసిన ఘటన ఉపాధి కూలీల్లో తీవ్ర విషాదం నింపింది. బుధవారం మొగల్తూరు మండలంలో 216 జాతీయ రహదారి పక్కన నల్లావారితోట వద్ద ఆయిల్ డబ్బాల లోడుతో వేగంగా దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి రోడ్డుకు ఆనుకుని ఉన్న పంట బోదెలో బోల్తా పడింది. అక్కడే ఉపాధి హామీ పథకంలో పంట బోదె బాగు చేస్తున్న కూలీలు కడలి పావని (45), గుబ్బల గంగావతి (55)పై వాహనం పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గంగావతి భర్త మాణిక్యాలరావు, మరో కూలీ గుడాలి సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. మాణిక్యాలరావును నరసాపురం, భీమవరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తీసుకెళ్లారు. మరో కూలీ సత్యనారాయణ తలకు బలమైన గాయం కాగా నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో 15 మంది కూలీలు అక్కడ పనిచేస్తున్నారు. అకస్మాత్తుగా రోడ్డుపై వెళుతున్న వాహనం తమవైపు పల్టీలు కొట్టుకుంటూ వచ్చి తోటి వారి మీదపడటంతో వారంతా భయందోళనలో పరుగులు తీశారు. వెంటనే తేరుకుని వాహనం కింద పడ్డ తోటివారిని విగత జీవులుగా చేతుల మీదుగా తీసుకుని బోరున విలపించారు. గాయపడిన వారిని నరసాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంతోపాటు, ప్రమాద స్థలంలో ఉన్న మలుపును గుర్తించలేకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, నరసాపురం డీఎస్పీ డాక్టర్ డి.శ్రీవేద పరిశీలించారు. ప్రభుత్వ పరంగ బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు. వ్యాన్ డ్రైవర్ వై.వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు ఆడపిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు
ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు మహిళలది, గాయపడ్డ మరో ఇద్దరు కూలీలదీ మొగల్తూరు మండలం నక్కావారిపేట పడమటి పాలెం. ప్రమాద వార్త తెలియగానే గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదంలో మృతి చెందిన పావనికి ఇందుశ్రీ, ప్రవల్లిక ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త సత్యనారాయణ ఆటో డ్రైవర్. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. ఇంట్లో తల్లితండ్రులు ఇద్దరూ కష్టపడితేగానీ ఇద్దరు ఆడపిల్లల ఆలనాపాలనా చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రమాదంలో తల్లి అకాలంగా మృత్యువాత పడింది. ఇందుశ్రీకి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో దేవుడు ఇంత పనిచేశాడని బంధువులు, ఇంటిపక్కవారు బోరున విలపించడం కన్నీళ్లు తెప్పించింది. ఇక మృతురాలు గంగావతికి పెళ్లయిన ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. గంగావతి ప్రాణాలు విడువగా, ఇంటికి పెద్దదికై ్కన మాణిక్యాలరావు ప్రాణాపాయం మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.
ఉపాధి హామీ కూలీలపైకి దూసుకొచ్చిన వాహనం
ఇద్దరు మహిళా కూలీల దుర్మరణం
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
నక్కావారిపాలెంలో తీవ్ర విషాదం

పొట్టకూటి కోసం వెళితే..

పొట్టకూటి కోసం వెళితే..

పొట్టకూటి కోసం వెళితే..