న్యూశాయంపేట: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్, జెడ్పీ ప్రత్యేక అధికారి డాక్టర్ సత్యశారద పాల్గొని జాతీయ పతాకాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన పాలన అందించేందుకు అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వసంత, అధికారులు పాల్గొన్నారు.
సర్వేయర్లకు కిట్ల అందజేత
న్యూశాయంపేట: హనుమకొండ ఐడీఓసీ ప్రాంగణంలో వరంగల్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో రీసర్వేలో భాగంగా లైసెన్డ్ సర్వేయర్లకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా కిట్లను అందజేశారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు కంటి పరీక్షలు
కాళోజీ సెంటర్: విద్యార్థుల్లో అంధత్వ నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 15 ఈ కార్యక్రమంలో ప్రారంభం కాగా, వరంగల్ జీహెచ్ నరేంద్రనగర్ కాశిబుగ్గ, నర్సంపేట ఎంజేపీటీబీసీ (బాలికలు)లో 929 మంది విద్యార్థులను పరీక్షించగా, 73 మందిలో దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించినట్లు ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఐ.ప్రకాశ్ తెలిపారు. 15 మంది విద్యార్థులను ప్రాంతీయ కంటి వైద్యశాలకు పంపినట్లు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్, కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 35,254 విద్యార్థులకు మూడు విడతలుగా కంటి పరీక్షలు నిర్వహించగా, 1,781 మందికి రిప్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని తెలిపారు. వారికి కంటి అద్దాలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్
పోటీలకు విద్యార్థిని ఎంపిక
వర్ధన్నపేట: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు మండలంలోని ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వాంకుడోతు స్రవంతి ఎంపికై ందని హెచ్ఎం లింగం శైలజ తెలిపారు. ఈనెల 19, 20, 21వ తేదీల్లో నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండల కేంద్రంలో జరగనున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈ మేరకు క్రీడాకారిణి స్రవంతి, పీఈటీ రఘువీర్ను హెచ్ఎం శైలజతో పాటు సర్పంచ్ మన్నూరు శారద సోము, ఉప సర్పంచ్ సంకినేని రాజు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ పబ్బోజు సునీత, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూజారి అశోక్, పంచాయతీ కార్యదర్శి శ్రీకర్, కారోబార్ భాస్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలో గురువారం అభినందించారు.
‘భద్రకాళి’ ఆదాయం
రూ.72 లక్షలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 76 రోజులకు రూ.72,30,387 ఆదాయం లభించిందని వరంగల్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. 628 యూఎస్ఏ డాలర్లు, 5 కెనడా డాలర్లు, 110 యూఏఈ దిరమ్స్, 10 బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పౌండ్స్, 60 బ్యాంక్ ఆఫ్ అరేబియా మానిటరీ అథారిటీ, 10 యూరోలు లభించాయని తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో వరంగల్ జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ పరిశీలకురాలు ఎన్.కవిత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ఆలయ సిబ్బంది, 200 మంది సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


