న్యూశాయంపేట: వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, వివిధ శాఖల సమన్వయం, తదితర అంశాలపై చర్చించారు. పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమీక్షలో డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సుమ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆనందం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి నట రాజన్, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలు అందేలా కృషి చేయాలి
ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ఆరోగ్యశ్రీ కింద మంజూరైన నిధులు, రివాల్వింగ్ ఫండ్ వినియోగం, ఆస్పత్రి డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, పెండింగ్లో ఉన్న నియామకాలపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. పెండింగ్ నియామకాలను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్, నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సంధ్య, సూపరింటెండెంట్ దామోదరీబాయి, తదితరులు పాల్గొన్నారు.


