ఖిలా వరంగల్: రోహిణి కార్తెలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా రైతులు, వ్యాపారులు, గమస్తాలు, దడువాయి, కార్మికులు వడదెబ్బకు గురవకుండా జూన్ 1 నుంచి 7 వరకు సెలవు దినాలుగా ప్రకటించాలని మార్కెట్ కార్మిక సంఘాలు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ కార్యవర్గం ప్రతినిధులు కోరారు. వీరి విజ్ఞప్తి మేరకు వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు వరుస సెలవులు ప్రకటిస్తూ శుక్రవారం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం నిర్ణయం తీసుకున్నారు. జూన్ 8న తిరిగి మార్కెట్ యార్డు పునఃప్రారంభం కానుందని స్పష్టం చేశారు. రైతులు తమ సరుకులను సెలవు రోజుల్లో మార్కెట్కు తీసుకురావొద్దని కోరారు.


