కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద
వరంగల్ అర్బన్ : ఉర్సుగుట్ట, రంగ సముద్రం సుందరీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద.. ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ హెల్త్శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉర్సుగుట్ట – రంగసముద్రం చెరువు బండ్ సుందరీకరణ పనులను శనివారం వారు తనిఖీ చేశారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం పనులు ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. అదేవిధంగా చెరువు బండ్ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచనలు చేశారు. తనిఖీలో బల్దియా ఈఈ సంతోష్ బాబు, సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు పాల్గొన్నారు.
భూముల మార్కెట్ విలువల
సవరణ పూర్తి చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ పురోగతిపై శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భూముల మార్కెట్ విలువల సవరణ గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు.


