వర్ధన్నపేట : మండలంలోని నల్లబెల్లికి బస్సు సర్వీస్ ట్రిప్పులను నడిపించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు బిర్రు మహేందర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడారు. బొల్లికుంటలో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఐదు రోజులుగా బస్సు నడవడం లేదన్నారు. తాత్కాలికంగా పంథిని మీదుగా బస్సును నడిపించి ప్రజల రవాణా ఇబ్బందులు తొలగించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్యాల దేవేందర్, ఎమ్మార్పీఎస్ నాయకుడు గోలి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరిపై కేసు
చెన్నారావుపేట : మండలంలోని అమీనా బాద్కు చెందిన బండి సారయ్య, బండి దిలీప్లపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన సింగరబోయిన ఎల్లయ్యపై సారయ్య, దిలీప్ దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్సై వివరించారు.
ఆర్థికసాయం
దుగ్గొండి : మండలంలోని స్వామిరావుపల్లికి చెందిన దాసరి వెంకటయ్య ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్రెడ్డి బుధవారం రూ.5 వేల నగదుతోపాటు 50 కిలోల బియ్యం సాయంగా అందజేశారు. తొలుత వెంకటయ్య చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగె నర్సింగరావు, నాయకులు కూరతోట సురేశ్, బండారి ప్రకాశ్, కోర్కెల ప్రశాంత్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందలో..
వర్ధన్నపేట : మండలంలోని ఇల్లందకు చెందిన చెన్న నాగమ్మ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి వన్నాల వెంకటరమణ, మండల అధ్యక్షుడు అడప రాజు, ఊట్ట పెద్దిరెడ్డి, రాంప్రసాద్ బుధవారం పరామర్శించారు. తొలుత నాగయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.2 వేల నగదు, క్వింటా బియ్యం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాంపెల్లి యాకయ్య, సట్ల అనిల్, దుర్గయ్య, బాబు, శంకర్, శ్రీధర్, రాము, హరీశ్, రాకేశ్, శ్రీకాంత్, రాము, అభి తదితరులు పాల్గొన్నారు.
నివాళి
గీసుకొండ : మండలంలోని కొమ్మాల లక్ష్మీ నృసింహస్వామి ఆలయ వంశపారంపర ్య ధర్మకర్త, చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందగా ఆయన మృతదేహానికి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాసాచార్యులు అంత్యక్రియల కోసం ఆలయ నిధుల నుంచి బాధిత కుటుంబానికి కార్యనిర్వాహక అధికారి (ఈఓ) రూ.20 వేలు అందజేశారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
పరామర్శ
సంగెం : మండలంలోని తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ గన్ను శారద అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆమెను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఆరోగ్య సమస్యపై అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గన్ను సంపత్, వేల్పుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై విచారణ చేయించాలి’
కాశిబుగ్గ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని బీకేఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాల తో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. విద్యార్థులకు తీరని నిరాశ మిగిలిందని పేర్కొన్నారు. నిపుణుల సూచనల మేరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు.


