కులమతాలకతీతంగా కలిసి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

కులమతాలకతీతంగా కలిసి ఉండాలి

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

కులమతాలకతీతంగా కలిసి ఉండాలి

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ

మహేశ్‌కుమార్‌ గౌడ్‌

దామెర: కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలసి ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. మండలంలోని ముస్త్యాలపల్లిలో బొల్లం లక్ష్మణ్‌–మంజు దంపతులు నిర్మించిన రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు దామెర క్రాస్‌ వద్ద కాంగ్రెస్‌ జిల్లా నాయకులు గోపాల నవీన్‌రాజ్‌ ఆధ్వర్యంలో గజమాల వేసి స్వాగతం పలికారు. ముస్త్యాలపల్లిలో డప్పుచప్పుళ్ల మధ్య వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రేణుకా ఎల్లమ్మతల్లి దీవెనలతో రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కేఆర్‌ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ‘కుడా’ చైర్మన్‌, హనుమకొండ డీసీసీ చైర్మన్‌ ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి, అరుణోదయ సంస్థ అధ్యక్షురాలు విమలక్క, వరంగల్‌ డీసీసీ చైర్మన్‌ అయూబ్‌, రాష్ట్ర నాయకులు మీసాల ప్రకాశ్‌, బుద్దె పెద్దన్న, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా వరంగల్‌ వెస్ట్‌ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ పాల్గొని పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement