● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● ‘పీఎం శ్రీ’లో వేసవి శిబిరాలు ప్రారంభం
కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తున్నారని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం వరంగల్లోని నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేసవి శిబిరాన్ని డీఈఓ రంగయ్యనాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకత, ఆత్మ విశ్వాసం, సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వేసవి శిబిరాలు ఈనెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఈఓ రంగయ్య నాయుడు మా ట్లాడుతూ జిల్లాలోని 11 పీఎం శ్రీ పాఠశాలల్లో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవిధంగా ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ, డీబీసీడీఓ పుష్పలత, ఎంఈఓ, హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


