నల్లబెల్లి: రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని, శాస్త్రవేత్తల సిఫారసు మేరకే వాడాలని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకట్రెడ్డి సూచించారు. మండలంలోని గుండ్లపాహడ్లో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగు మెళకువలు, భూసార పరిరక్షణపై కీలక సూచనలు చేశారు. శాస్త్రవేత్త బి.మాధవి మాట్లాడుతూ మార్కెట్లో మంచి ధర పలికే వరి రకాల గురించి వివరించారు. అనంతరం పలు సూచనలతో ముద్రించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బన్న రజిత, ఏఈఓ వినూష, రైతులు పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం: పంటల సాగులో రైతులు మెళకువలు పాటించాలని శాస్త్రవేత్తలు శ్రావణ్, హరీష్లు అన్నారు. మండలంలోని మంగళవారిపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధునాతన పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఈ సమావేశంలో జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్టెంట్ సారంగం, ఏఓ భోగ శ్రీనివాస్, సర్పంచ్ గొంది సుజాత, విస్తరణ అధికారి అంకుశావలీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.


