● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన మక్కలు
● 20 రోజులుగా తప్పని ఎదురుచూపులు
నర్సంపేట/ఖిలా వరంగల్: జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాలవర్షం మక్క రైతులను ఆగం చేసింది. చేతికొచ్చిన పంటను కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నర్సంపేట, ఏనుమాముల మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో మక్కలు తడిసిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్క బస్తాలపై పరదాలు కప్పినా ఈదురుగాలుకు కొట్టుకుపోయాయని పేర్కొంటున్నారు.
32 వేల ఎకరాల్లో మక్కసాగు..
రైతులు ఈ యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా 32 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. విస్తీర్ణం పెరిగి మార్కెట్ యార్డులకు మొక్కజొన్నలు పోటెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా మక్కల రాశులే కనిపిస్తున్నాయి. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో రైతులు 20 రోజులుగా నీరిక్షిస్తున్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు వద్ద వాహనాల వివరాలను నమోదు చేయడం వదిలేసినట్లు తెలుస్తోంది. రైతులు నేరుగా తెచ్చిన మక్కలను పక్కన పెట్టి వ్యాపారులు తెచ్చిన పంటను కోనుగోళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అకాల వర్ష భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మక్కలను తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


