స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్: రైతులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ నాయకులు రాజకీయ పబ్బం గడిపేందుకు యత్నిస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. మండలంలోని పెద్ద పెండ్యాలలో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈమేరకు గ్రామంలో రూ.3 కోట్ల ‘కుడా’ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.48 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, ఎస్సీ, రజక, ముదిరాజ్ కమ్యూనిటీ హళ్ల ప్రహరీ మొత్తం రూ.3.62 కోట్ల విలువైన అభివృద్ధి పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో గన్నీ బ్యాగుల కొరత, గోదాంలు ఖాళీ లేక ధాన్యం కొనుగోళ్లలో కొంత జాప్యం జరుగుతుందని, దీనిని రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ తోట నాగరాజు, వివిధ శాఖల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


