ఖానాపురం: తెలంగాణ రాష్ట్రంలో నేర రహిత సమాజ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్ను సోమవారం ఆమె ప్రారంభించారు. స్వయంగా ఆమె వాహనాలకు పెట్రోల్ పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీ సౌమ్యామిశ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో 32 పెట్రోల్ బంక్లు ఉన్నాయని, ఇందులో వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాలో 8 బంక్ల నిర్వహణ సాగుతుందన్నారు. జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చిన ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 300కి బంకుల్లో ఉపాధి కల్పించినట్లు తెలిపారు. జైలు జీవితాలు గడిపిన వారు బయటకు వస్తే పనులు లభించవని, ఉపాధి కల్పిస్తే వారిలో కూడా మార్పువస్తుందన్నారు. జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడిపే పెట్రోల్బంక్లపై ప్రజల్లో మంచి నమ్మకాన్ని కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ డీఐజీ సంపత్, డీసీపీ అంకిత్కుమార్, వరంగల్ జైల్ సూపరింటెండెంట్ కళాధర్, ట్రైనీ ఐపీఎస్ మనీషామెహ్రా, డిప్యూటీ జైలర్ కృష్ణకాంత్, ఐఓసీఎల్ రిటైల్ సేల్స్ మేనేజర్ శరత్బాబు, చీఫ్మేనేజర్ స్వామినాథరావు, మహిళా జైలు సూపరింటెండెంట్ స్రవంతి, సర్పంచ్ దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 300 మందికి ఉపాధి
జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా


