● ‘ఆత్మ’ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల
● ఆరెపల్లిలో ఏరువాక సాగుబడి కార్యక్రమం
గీసుకొండ: రైతులు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను సమతుల్యంగా పంట చేలకు వేయాలని, కాంప్లెక్స్ ఎరువులను మోతాదుకు మించి వాడితే భూసారం దెబ్బతింటుందని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) విజయనిర్మల అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఆరెపల్లిలో ఏరువాక సాగుబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ మోతాదు ప్రకారం ఎరువులను వాడితే నేలపొరల్లో పేరుకుని పోయిన భాస్వరాన్ని తిరిగి మొక్కలకు అందేలా చేయవచ్చని సూచించారు. కేవీకే శాస్త్రవేత్త సౌమ్య మాట్లాడుతూ పత్తి, మొక్కజొన్న, వరి పంటల్లో అధికంగా రసాయన ఎరువులను వాడితే నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చిరొట్ట ఎరువులతో భూసారాన్ని పెంచవచ్చన్నారు. ఉద్యానశాఖ అధికారి తిరుపతి మాట్లాడుతూ రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలన్నారు. సర్పంచ్ తుమ్మనపల్లి స్వప్నశ్రీనివాస్, ఏఓ హరిప్రసాద్బాబు, ఏఈఓ పి.స్మిత, హెచ్ఈఓ వేణుకుమార్, రైతులు పాల్గొన్నారు.


