పర్వతగిరి: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దని అదనపు కలెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు.మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆమె సందర్శించి మాట్లాడారు. వరికోత సమయంలో హార్వెస్టర్ ఆర్పీఎం 19, 20 ఉండే విధంగా చూసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. తహసీల్దార్ వెంకటస్వామి, డీఎం సంధ్యారాణి, డీటీ మధుసూదన్, ఎంపీఎం రాజీరు, ఏఓ ప్రశాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కలెక్టర్ సత్యశారద ఆస్పత్రిని సందర్శించి అస్తవ్యస్త వైద్య సేవలను గుర్తించి వైద్యులు, సిబ్బందిని మందలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ హాజరుపట్టిక, నిర్వహణ రికార్డులు, వార్డుల్లో రోగులకు అందించే వైద్య సేవలను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
కూలీలకు
పనులు కల్పించాలి
పర్వతగిరి: ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఎక్కువ పనులు కల్పించాలని డీఆర్డీఓ నాగపద్మజ అన్నారు. మండల కేంద్రంలో రూర్బన్ పథకంలో నిర్మించిన కన్వెన్షన్ హాల్ను శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. పనిప్రదేశాల్లో నీడ సౌకర్యం, తాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, ఏఈ రఘువంశీ, ఏపీఓ సుశీల్, ఈసీ రాజు, టీఏ సురేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
చలపర్తి గోడౌన్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్!
దుగ్గొండి: చలపర్తి గ్రామంలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(ఎస్డబ్ల్యూసీ) గోడౌన్లో రూ.4 లక్షల విలువైన 100 క్వింటాళ్ల సివిల్ సప్లయీస్ బియ్యం మాయమైన ఘటనలో పలువురిపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. టాస్క్ఫోర్స్ అధికారులు ఈనెల 20న దాడులు చేశారు. అనంతరం జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ సంధ్యారాణి ఈనెల 21న గోడౌన్ మేనేజర్ సహా మరో ఇద్దరిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ సాయిరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో గోడౌన్ మేనేజర్ స్వప్న, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్పై స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు వేటు వేసినట్లు తెలిసింది. ఈ విషయమై స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ దీపిక మాట్లాడుతూ ఘటనకు బాఽధ్యులుగా భావిస్తున్న మేనేజర్ స్వప్న, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్పై శాఖాపరమైన చర్యలపై ప్రాసెస్ జరుగుతోందని పేర్కొన్నారు. విధుల్లో అక్రమాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు.
దూరవిద్య డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య(సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ) డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (2023–24 బ్యాచ్) పరీక్షలు మే 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొపెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. మే 7, 11, 13, 15, 18, 20 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.


