● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాశిబుగ్గ: ప్రజల భాగస్వామ్యంతోనే మలేరియా నియంత్రణ సాధ్యమవుతుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంజీఎం నర్సింగ్ స్కూల్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీని కలెక్టర్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంజీఎం అకడమిక్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2030 నాటికి మలేరియా రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కీటక జనిత వ్యాధులపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, ప్రజలు కూడా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా మలేరియా వ్యాధి నివారణ, అవగాహన కోసం తయారు చేసిన కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. డీఎంహెచ్ఓ సాంబశివరావు మాట్లాడుతూ జిల్లాలో మలేరియా వ్యాధి నివారణ కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఒకే కేసు నమోదైందని తెలిపారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, జిల్లా మలేరియా అఽధికారి కె.రజిని, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్ పాల్గొన్నారు.


