● ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం
● రూ.పది లక్షల విలువైన ఆస్తినష్టం
నర్సంపేట: నర్సంపేట పట్టణం 16వ వార్డు పర్శనాయక్తండాలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన రైతులు బానోత్ సమ్మయ్య, మేఘా, రవి, కిషన్, నారాయణ, సారయ్య, హరిసింగ్, వీరస్వామి ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంటసాగుచేశారు. మధ్యాహ్న సమయంలో ప్రమాదవశాత్తు పంటకు మంటలు అంటకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. సకాలంలో ఫైర్ ఇంజన్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేయడంతో పక్కనే ఉన్న ఇతర పంట పొలాలకు ప్రమాదం తప్పింది. కౌన్సిలర్ బానోత్ నవీన్నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత రైతులను పరామర్శించారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అగ్ని ప్రమాదంతో సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ కళ్ల ముందే పంట బూడిద కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.


