కమలాపూర్: మండల వ్యాప్తంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కుక్కలు 229 మందిని కరిచాయి. ఎండాకాలంలో వీధి, పిచ్చి కుక్కలు మరింతగా రెచ్చిపోతున్నాయి. ఇటీవల కమలాపూర్ మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో ఒకే రోజు పిచ్చి కుక్క దాడి చేసి ముగ్గురు చిన్నారులతోపాటు మరో ఇద్దరిని కరిచి గాయపరిచింది. వీధి, పిచ్చి కుక్కలకు భయపడి గ్రామస్తులు ఇళ్లనుంచి బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. రోడ్డు వెంట వెళ్తున్న వాహనదారులను కుక్కలు వెంబడిస్తుండడంతో ఇప్పటికే పలువురు వాహనదారులు ద్విచక్ర వాహనాలపైనుంచి కింద పడిపోయి గాయాలపాలయ్యారు. కుక్కలను నియంత్రించి వాటి బారినుంచి తమను రక్షించాలని మండల వాసులు వేడుకుంటున్నారు. కాగా, కమలాపూర్ ప్రభుత్వాస్పత్రిలో కుక్క కాటుకు సంబంధించి యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు 150 వరకు అందుబాటులో ఉన్నట్లు సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ నరేశ్ తెలిపారు.


