శోభాయమానం.. శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

శోభాయమానం.. శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

అమ్మవారికి సింహవాహన సేవ, గజవాహనసేవ

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై, సాయంత్రం గజవాహనంపై ఊరేగించారు. సేవాకార్యక్రమాలకు వరంగల్‌ ఆర్యవైశ్య (పట్టణ) సంఘం, చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆర్యవైశ్య నాయకులు గుండా ప్రకాశ్‌రావు, తొనుపునూరి వీరన్న, శ్రీవైష్ణవ సంఘం ప్రముఖులు వరయోగుల సురేశ్‌, రమాదేవి దంపతులు పాల్గొన్నారు. భూదాన్‌ పోచంపల్లి పద్మశాలీలు రుద్రవంశీయులు రుద్ర శ్రీశైలం, లావణ్య, రుద్ర చెన్న కేశవులు, వాణి, రుద్ర పాండురంగశాస్త్రి, వాసవి దంపతులు ప్రతియేటా మాదిరిగానే అమ్మవారి కల్యాణానికి రెండు పోచంపల్లి పట్టుచీరలు, పట్టుదోవతులు సమర్పించారు. సారె అందజేశారు. రాత్రి ఆలయ అవరణలో పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement