● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యతో కలిసి మక్కల కొనుగోలు, నిల్వ లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 72వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా 2.25 మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదు అయ్యిందన్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి వ్యవసాయ శాఖ జేడీ అనురాధ, డీసీఓ నీరజ, డీఎం మార్క్ఫెడ్ రంజిత్రెడ్డి, తహసీల్దార్లు, మార్కెట్కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తి: మండలకేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ సత్యశారద మంగళవారం సందర్శించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ కాపిటీషన్, స్కిట్తోపాటు పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కలెక్టర్ పాల్గొని విద్యార్థులతో పలు అంశాలపై మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి, పోషకాహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, ప్రిన్సిపాల్ సరిత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
మెరుగైన వసతులు కల్పించాలి
పర్వతగిరి: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం పర్వతగిరి కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీలు, అందిస్తున్న విద్యా సదుపాయాలు, వసతి, ఆహార నాణ్యత, పరిశుఽభ్రత వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. గురుకులాల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు, ఇతర సహ పాఠ్య కార్యక్రమాలను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ పుష్పలత, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపాల్ సల్మా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


