● జాతీయ రహదారిపై రాస్తారోకో
నల్లబెల్లి: మొక్కజొన్న బస్తాలను దిగుమతి చేయడంలో గోదాం నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలంలోని బజ్జుతండా శివారులోని జాతీయ రహదారిపై రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు. మూడు రోజులుగా మొక్కజొన్న బస్తాలతో వాహనాలు గుండ్లపహాడ్ గోదాం వద్ద వేచి ఉన్నా అధికారులు దిగుమతి చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ట్రాక్టర్ను అడ్డుపెట్టి బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై గోవర్ధన్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చించి రాస్తారోకో విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నల్లబెల్లి కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా పంట ఉత్పత్తులను నిర్వాహకులు దిగుమతి చేసుకోవడం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు వేడుకున్నారు.


