నయీంనగర్: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్ ఆవరణలోని వరంగల్–1 డిపో ఎదుట రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జేబీఎం ఎలక్ట్రిక్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తులుగా ఉండి మోడీ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసినా పట్టించుకోని పక్షంలో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రవాణా కమిషనర్ చర్చలకు పిలిచిన యాజమాన్యం, ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదన్నారు. అధిక పని భారమైనప్పటికీ మహాలక్ష్మీ పథకాన్ని ఆర్టీసీ కార్మికులు విజయవంతం చేశారన్నారు. కొందరు యాని యన్ నాయకులు, అధికారులు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని వారికి కార్మికులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో రీజియన్ జేఏసీ నాయకులు ఎం.శ్రీనివాస్, యాకస్వామి, టి.శ్రీనివాస్, జీఎస్.పాణి, మండరాజు, బాలరాజు, రమేశ్, పోతరాజు, వలీధర్, కుమార్, రవీందర్, అర్చన, కల్పన, నవత, ఉమారాణి, కవిత, సుమతి, కార్మికులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి
రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న


